భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై రాష్ట్ర ప్రభుత్వం దాడులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భువనేశ్వర్ శివార్లలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అక్రమంగా నిల్వ ఉంచిన 505 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నాయి. అనధికార ఇంధన వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఖుర్ధా జిల్లా కలెక్టర్ అమృత్ రుతురాజ్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. అధికారుల కథనం ప్రకారం డీజిల్, పెట్రోల్ను నిల్వ ఉంచుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక పెట్రోల్ పంపులు, అక్రమ నిల్వ కేంద్రాలపై జిల్లా పౌర సరఫరాల అధికారి, భువనేశ్వర్ సహాయ పౌర సరఫరాల అధికారి, బలియంత పౌర సరఫరాల ఇన్స్పెక్టర్, బలిపట్న పౌర సరఫరాల ఇన్స్పెక్టర్లతో కూడిన ఒక ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో నిరంజన్ నాయక్, బుల్లూ ప్రధాన్, పూరణ్ ప్రధాన్, సుశాంత్ కుమార్ చౌదరి, తపన్ కుమార్ సాహు, మరో 5 మంది నుంచి 505 లీటర్ల అక్రమ నిల్వ డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇంధన వ్యాపారంలో ఉపయోగించే కొలత పాత్రలు, ఇతర పరికరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద పంపిణీ లైసెన్సులు గానీ, అగ్నిమాపక సేవల శాఖ నుంచి తప్పనిసరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు లేవని అధికారులు తెలిపారు. వారు అక్రమ లాభాలు ఆర్జించే ఉద్దేశంతో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లీటరు డీజిల్ను రూ. 140 చొప్పున విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఖుర్దా జిల్లా పౌర సరఫరాల అధికారి జ్ఞానేంద్ర మిశ్రా, సహాయ పౌర సరఫరాల అధికారి సునీతా బెహరా, బలియంత పౌర సరఫరాల ఇనస్పెక్టర్ అలకా రాణి మల్లిక్, బలిపట్న పౌర సరఫరాల ఇన్స్పెక్టర్ నేత్రానంద బెహరాల సమక్షంలో ఈ దాడులు జరిగాయి.


