అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన ప్రసాద ట్రస్ట్కు విశాఖపట్నంకు చెందిన ఎంజీకే.కుమారి పేరిట ఆమె కుమారుడు రాజభూషణ్ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఈమేరకు ఆదివారం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్కు విరాళ చెక్కును అందించారు. అనంతరం దాతలకు ప్రత్యేకంగా ఆదిత్యున్ని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించేలా చర్యలు చేపట్టారు. దాతల విరాళాలతో వచ్చిన వడ్డీలతో అన్నదాన ప్రసాదాలను నిత్యం అందజేస్తున్నామని..ఇటీవల కాలంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తుందన్నారు.
స్విమ్మింగ్లో దరహాస్కు రజతం
శ్రీకాకుళం న్యూకాలనీ : స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన స్టార్ స్విమ్మర్ వేమకోటి ధనుష్య దరహాస్ మరోసారి సత్తాచాటాడు. ఆదివారం విజయవాడలోని ఎలైట్ స్విమ్మింగ్ పూల్ వేదికగా జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి మోడరన్ పెంటథ్లాన్ పోటీలలో బైయాతలాన్ విభాగంలో దరహాస్ మెరిశాడు. జూనియర్ విభాగంలో రిలే కేటగిరీలో రజత పతకం సాధించి శభాష్ అనిపించాడు. దరహాస్ పతకం సాధించడం పట్ల తల్లిదండ్రులతోపాటు స్విమ్మింగ్ సంఘ జిల్లా అధ్యక్షుడు హారిక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, కోచ్ మురళీధర్, అంతర్జాతీయ వెటరన్ స్విమ్మర్ ఎస్.కాంతారావు, సూర్యారావు, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు తదితరులు అభినందించారు.
కిడ్నీ వ్యాధితో మాజీ సర్పంచ్ మృతి
కవిటి : రాజపురం పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ సనపల జానకిరావు(64) ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు. కిడ్నీవ్యాధితో కొన్నిరోజులుగా బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆరో గ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఆదివారం మధ్యాహ్నం మరణించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తసాడి శ్యాంప్రసాద్రెడ్డి రాజపురం వెళ్లి జానకిరావు పాడె మోశారు. కవిటి మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కడియాల ప్రకాష్, నర్తు నరేంద్రయాదవ్, సల్ల దేవరాజు తదితరులు సైతం నివాళులు అర్పించారు.
బ్యాగ్ అప్పగింత
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఓ ఆటోలో మూడు రోజుల క్రితం బ్యాగు చేజార్చుకున్న పలాసకు చెందిన కుంచాడ కుమారికి ట్రాఫిక్ పోలీసులు బ్యాగును కనుగొని ఆదివారం అప్పగించారు. ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి సూర్యమహల్ వరకు ప్రయాణించిన ఆటోలో కుమారి బ్యాగు మరిచిపోయారని, సీసీ ఫుటేజీ ఆధారంగా కర్ణపు వీధికి చెందిన దూగాన కృష్ణ ఆటోలో గుర్తించామని ట్రాఫిక్ సీఐ రామారావు పేర్కొన్నారు.
రోటరీనగర్లో చోరీ
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని రోటరీనగర్ మూడో వీధిలో శనివారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఆర్డబ్ల్యూఎస్లో డీఈగా పనిచేస్తున్న పి.దుర్యోధన కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెవెళ్లాడు. ఇదే అదునుగా దొంగలు ఇంటి తలుపు తాళాలు పగలుగొట్టి లోపలికి చొరబడి రూ.4,500 నగదు, కొన్ని వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి, సీఐ రామకృష్ణ అక్కడకు వెళ్లి పరిశీలించారు.


