అనాథ విద్యార్థుల..
పర్లాకిమిడి: గజపతి జిల్లా శిశు సురక్షా సమితి ఆధ్వర్యంలో కరోనా సమయంలో తల్లిదండ్రులు లేని అనాధలను చేరదీసి వారికి వివిధ ఉన్నత పాఠశాలల్లో చదివించి ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 36 మందికి అధికారులు అభినందనలు తెలిపారు. గజపతి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఏడీఎం ఫల్గుణి మఝి, జిల్లా అత్యవసర అధికారి బినాయక్ రౌళో, శిశు సంక్షేమశాఖ అధికారి అమియ త్రిపాఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, జిల్లా ఉపాధి అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని కాశీనగర్, గుమ్మా, పర్లాకమిడి, గుసాని, నువాగడ సమితిల నుంచి 85 మంది టెన్త్ పాసైన అనాధ విద్యార్థులు పాల్గొన్నారు. అనాధ విద్యార్థుల భవిష్యత్కు పునాదులు వేయడానికి భువనేశ్వర్ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మ్యానేజిమెంట్ (ఐ.హెచ్.యం.), క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, ప్రతినిధి అవినాష్ దాస్, గుమ్మ ఐ.టి.ఐ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు టెన్త్ పాసైన విద్యార్థులకు వారి కళాశాలలో సీట్లు ఇవ్వడానికి ముందుకువచ్చారు. వారికి ఐ.టి.ఐ. పాలిటెక్నిక్ కళాశాలలో సీట్లు ఇవ్వడానికి అంగీకరించేందుకు జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు తెలిపింది.


