అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం జ్యేష్ట మాస సందడి కనిపించింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. మరికొందరు తలనీలాలను సమర్పించారు. ఇంద్రపుష్కరిణి ఒడ్డున గ్రామీణ ప్రాంత మహిళలు సంప్రదాయ పూజలు చేశారు. రావిచెట్టు వద్ద దీపాలను పెట్టుకుని పెసలు, మొలకలు, మామిడి పళ్లు వంటి ప్రసాదాలను స్వామికి నివేదించారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎండ నుంచి రక్షణ చర్యలు చేపట్టారు. ఆలయంలో రూ.300 టికెట్తో అంతరాలయ దర్శనం కల్పించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తులకు గోత్రనామలతో పూజలు జరిపించారు.


