మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలోని చిత్రకొండ, కలిమెల ప్రాంతాల్లోని ఆవులను కొంతమంది వ్యాపారులు కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణలోని కబేళాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శనివారం రాత్రి 2 గంటల సమయంలో పశువులను అక్రమంగా తరలిసున్నారనే సమాచారం తెలుకున్న మల్కన్గిరి సనాతనీ గ్రూప్, భజరంగ్ దళానికి చెందిన కొంతమంది యువకులు కలిమెల పంచాయతీ పరిధిలో గల అలసిగూడ గ్రామ సమీపంలోని పునిమేట్ల ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న 15 ఆవులను అడ్డుకున్నారు. ఆవులను నడిపిస్తూ తీసుకెళ్తున్న కాలిగూడ గ్రామానికి చెందిన కరా ముక్త, మందాపల్లి గ్రామానికి చెందిన యోగ హల్బా అనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు. ఈ విషయాన్ని కలిమెల పోలీసు స్టేషన్లో ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విజయ్ కుమార్ మాఝి సంఘటనా స్థలానికి చేరుకొని ఆవులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరేస్టు చేసి కేసు నమోదు చేశారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని తెలిపారు.


