శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం వేదికగా జరుగుతున్న చెస్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లా చెస్ అసోసియేషన్ సారథ్యంలో సీఎస్ఎన్ ట్రస్ట్, గీతా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని గ్రాండ్ కన్వెన్షన్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ క్రీడాకారులు ముందంజలో ఉన్నారు. వీరికి తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక క్రీడాకారులు గట్టిపోటీనిస్తున్నారు. నాలుగో రోజు ఆదివారం ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చెస్ క్రీడాకారుల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని, మంచి చిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంత పెద్ద చెస్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ మహిళా అధ్యక్షురాలు సారూప్య(అమెరికా), ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సుధీర్, టోర్నమెంట్ కన్వీనర్ హెచ్.ఉపేంద్ర సీఐ, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు బగాది కిషోర్, కెవీ జ్వాలాముఖి, సీఎన్ ట్రస్ట్ ట్రస్టీ తాండ్ర సునీల్, టోర్నమెంట్ డైరెక్టర్ సనపల భీమారావు తదితరులు పాల్గొన్నారు.


