జయపురం: సమష్టి పోరాటాలతోనే హక్కులను సాధించగలమని ఒడిశా వనవాసీ కల్యాణ ఆశ్రమం ప్రాంతీయ కో–ఆర్డినేటర్ రతీకాంత సాహు అన్నారు. స్థానిక అఖిల భారతీయ ఆదివాసీ భొత్ర వికాస పరిషత్ భవనంలో కొరాపుట్ జిల్లా జనజాతి సురక్షా మంచ్, ఒడిశా వనజాతి కల్యాణ ఆశ్రమంలు సంయుక్తంగా శనివారం నిర్వహించిన చలో ఢిల్లీ నిర్వహణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ ఆదివాసీ భొత్ర వికాస పరిషత్ కొరాపుట్ జిల్లా మాజీ అధ్యక్షుడు నీలకంఠ చలాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రతీకాంత సాహు మాట్లాడారు. పాలకులు ఆదివాసీ ప్రజల హక్కులను కాలరాస్తూ ఖనిజ సంపదను కార్పొ రేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దీనివలన గిరిజనుల మనుగడకే ముప్పు ఏర్పడిందన్నారు. అందువలన జనజాతి, వనజాతి ఆదివాసీ ప్రజల హక్కుల సాధనకు అఖిల భారత సమ్మిళినీ ఈనెల 24వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునిచ్చిందని వెల్లడించించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఒడిశా వనవాసీ కల్యాణ ఆశ్రమం ప్రాంతీయ సహాయ కో–ఆర్డినేటర్ లక్ష్మీకాంత మిశ్ర పర్యవేక్షణలో కోట్పాడ్ పట్టణ జనజాతి సురక్షా సమితి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షునిగా భీమ మఝి, ఉపాధ్యక్షునిగా అనామ్ అమనాత్య, కార్యదర్శిగా కేశవ పూజారి, సహాయ కార్యదర్శిగా హరిబందు మఝి, కోశాధిపతిగా ధనపతి చలాన్, సభ్యులుగా ఎస్.మఝి, పరబ పూజారి, కిశోర్ చంద్ర భూమియలను నియమించారు.


