రాయగడ: స్థానిక రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం, సామూహిక వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన చర్యలు రాయగడ జిల్లాలో విశేష ఫలితాలను అందిస్తున్నాయి. ఒడిశా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ సొసైటీ, రైతు ఉత్తత్తిదారుల సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ప్రయత్నాలు మరో విజయాన్ని నమోదు చేశాయి. ఒర్మాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక మార్కెటింగ్ కార్యక్రమం ద్వారా 2.5 మెట్రిక్ టన్నుల అమ్రాపల్లి రకం మామిడి పండ్లను విజయవంతంగా న్యూఢిల్లీకి తరలించారు. మునిగుడ సమితికి చెందిన రైతుల నుంచి కేఏపీసీఎల్ నుంచి ఈ మామిడి పండ్లను సేకరించారు. న్యూఢిల్లీలోని ప్రముఖ మదర్ డెయిరీ సంస్థకు ఈ మామిడి పండ్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిన రవాణా వాహనాన్ని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ శనివారం లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఇటువంటి తరహా చర్యలు కీలకమని ఆయన పేర్కొన్నారు.


