గోడకూలి కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గోడకూలి కార్మికుడి మృతి

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

భువనేశ్వర్‌: గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో కార్మికుడు శిథిలాల కింద కూరుకుపోయి మృతి చెందాడు. కార్మికులు నిర్మాణ సంబంధిత పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం. శనివారం పూరీ చక్రతీర్థ రోడ్డు సమీపంలోని దుర్గా లాడ్జి వద్ద ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దీంతో సమీపంలో ఉన్న స్థానికులు, తోటి కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక బృందం కూలిపోయిన కట్టడం కింద నుంచి కార్మికుడిని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ ప్రదేశంలో ఉన్న మరో కార్మికుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు సకాలంలో ప్రాణాలతో బయటపడటంతో ఈ విషాద ఘటనలో మరిన్ని ప్రాణనష్టాలు నివారించబడ్డాయని భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతి చెందిన కార్మికుడు జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ ప్రాంతానికి చెందిన పప్పూగా భావిస్తున్నారు. అధికారులు అతని గుర్తింపు, ఇతర వివరాలను ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు డిమాండ్‌ చేశారు. నిర్లక్ష్యం, నాసిరకం నిర్మాణ పద్ధతులు, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటివి ఈ ఘోర ప్రమాదానికి దోహదపడ్డాయా అనే విషయాలపై అధికారులు విచారణ జరపాలని కోరారు. ఈ విచారకర ఘటనకు దారి తీసిన పరిస్థితులను నిర్ధారించేందుకు మైరెన్‌ ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement