● పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన అధికారులు
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో తీవ్రమైన ఇంధన కొరత శుక్రవారం తలెత్తింది. అనేక పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకుంది. ఈ విషయం సామాజిక మాధ్యమాలలో విమర్శలు రావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. నబరంగ్పూర్ జిల్లాలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, పౌర సరఫరాల శాఖా అధికారులు సంయుక్తంగా బంకులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న స్టాక్, వస్తున్న స్టాక్ వివరాలు పరిశీలించారు. జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు రూ. 200 విలువైన పెట్రోల్ మాత్రమే ఇస్తున్నారు. మరో వైపు కొరాపుట్ జిల్లాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ నోస్టాక్ బోర్డులు వెలిశాయి. పెద్ద వాహనాలకు పెట్రోల్ ఇవ్వలేక అవిరాకుండా మార్గాలు మూసి వేశారు. ఉన్నతస్థాయి వ్యక్తులు వాహనాలు తగ్గి పర్యటిస్తున్న వార్తలు టీవీలలో చూసి పెట్రోల్ సంక్షోభం ఏర్పడుతుందనే వదంతులు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. దాంతో బంకుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


