జయపురం: జయపురం–మల్కన్గిరి రైల్వేలైన్ కోసం తమ భూములు తీసుకున్న ప్రభుత్వం నేటి వరకు తగిన పరిహారం చెల్లించలేదని బాధిత రైతులు నేడు బొయిపరిగుడ తహసీల్దార్ కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. భూములు కోల్పోయిన బాధితుల సంఘం నేతృత్వంలో బాదితులు ఆందోళన జరిపారు. జయపురం–మల్కన్గిరి రైలు మార్గం కోసం తమ భూములు తీసుకున్నారని, అయితే భూములకు నష్ట పరిహారం చెల్లించలేదని వారు ఆరోపించారు. అందు చేత తాము తహసీల్దార్ కార్యాలయాన్ని ఘొరావ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న అదనపు తహసీల్దార్ ఝడేశ్వర షొడంగికి మెమోరాండం సమర్పించారు. జయపురం–మల్కనగిరి కొత్త రైల్వే లైన్ కోసం సర్వే జరిపే ముందు అనేక మంది రైతులు తాము భూములు కోల్పోతామని భావించారని, అందుకు భూములు ఇచ్చేందుకు నిరాకరించినా అధికారులు బలవంతంగా
భూములు తీసుకున్నారని వారు ఆరోపించారు. అయితే భూములు కోల్పోయిన బాధితులకు ఉచిత ధర చెల్లించకుండా ఎండు చేపల మార్కెట్లా తమ ఇష్టం వచ్చిన ధర ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించటంతో భూములు కోల్పోయిన బాదిత రైతుల సంఘం తహసీల్దార్ను కలసి భూములకు మార్కెట్ ధర చెల్లించాలని కోరటం జరిగిందని వెల్లడించారు. ఆ మేరకు తహసీల్దార్కు మెమొరాండం సమర్పించినట్లు వెల్లడించారు. ప్రస్తుత భూమి ధర ప్రకారం జయపురం నుంచి మల్కన్గిరి వరకు సేకరించిన భూముల రైతులకు పరిహారం చెల్లించాలని బాధిత రైతుల సంఘం డిమాండ్ చేసింది. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో చదుకున్న వారి చదువులను బట్టి వారి అర్హత మేరకు రైల్వే విభాగంలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం పంట భూములు, ఇళ్ల స్థలాలు సమకూర్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.


