పర్లాకిమిడి: సీబీఎస్ఈ ప్లస్ 2లో స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ముగ్గురు టాపర్గా నిలిచారు. వందనా రవుతో (91.24శాతం), అనితా రాజు 91.2 శాతం, అభిలాష పాత్రో 90 శాతం మార్కులు సాధించారు. వీరే కాక 12 మంది విద్యార్థులు 80శాతం, 26 మంది విద్యార్థులు 70 శాతం మార్కులు సాధించినట్టు ప్రిన్సిపల్ సునీతా పాణిగ్రాహి తెలిపారు. సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ 12వ తరగతి విద్యార్థులకు అధ్యక్షులు డాక్టర్ ముక్తీ కాంత మిశ్రా, ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, ప్రాంతీయ డైరక్టర్ (అడ్మిన్)సంబిత్ పాత్రో, వైస్ ప్రిన్సిపల్ జేకే నాయక్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి వెంకటపాలెం పంచాయతీ మాంగిపల్లి గ్రామంలో మతమార్పడులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. 250 కుటుంబాలు ఉన్న ఊరిలో వెయ్యి మంది వరకు మరో మతాన్ని స్వీకరించారు. గ్రామంలోని పూజలు, కట్టుబాట్లలో వారి జోక్యం పెరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బయట ప్రాంతాలు, ఇతర భాషలకు చెందిన వారు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. దీన్ని అరికట్టాలని గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ అందజేశారు.


