ఎక్స్‌ప్రెస్‌ రైల్‌ సేవలకు ఆమోదం | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ రైల్‌ సేవలకు ఆమోదం

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

రాయగడ: రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీ అభివృద్ధిలో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ పూరి–కొరాపుట్‌ మధ్య కొత్త త్రై సప్తాహిక ఎక్స్‌ప్రెస్‌ రైల్‌ సేవకు ఆమోదం తెలిపింది. పూరి–కొరాపుట్‌–పూరి ఎక్స్‌ప్రెస్‌ రైతుల తీర ప్రాంతం, పశ్చిమ, దక్షిణ ఒడిశా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మరింత బలొపేతం చేయనుంది. ఈ రైలు ఖుర్దా రోడ్‌ , భువనేశ్వర్‌, డెంఖానాల్‌, తాల్చేర్‌ రోడ్డు, అనుగూల్‌, బొయిండా, రెఢాకాల్‌, సంబల్పూర్‌, బరఘడ్‌ రోడ్డు, బలంగీర్‌, టిట్లాఘడ్‌, కేసింగా, మునిగుడ, రాయగడ, టికిరి, లక్ష్మీపూర్‌ రోడ్డు, కక్కిరిగుమ్మ, ధమన్‌జొడివంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ కొత్త సేవ ద్వారా పూరి, భువనేశ్వర్‌ వంటి ప్రధాన నగరాలకు దక్షిణ ఒడిశాలోని ఆదివాసీ ప్రాబల్యం ఉన్న జిల్లాల మధ్య నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడనుంది. దీనివల్ల విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయ అభివృద్ధి చోటు చేసుకోనుంది. ప్రత్యేకంగా కేబీకే ప్రాంత జిల్లాలైన కొరాపుట్‌, రాయగడ, కలహండి ప్రాంతాలకు అనుసంధానించే విధంగా సహకరిస్తుంది. శ్రీజగన్నాథ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు, కొరాపుట్‌ రాయగడ ప్రాంతాల ప్రకృతి సౌందర్యాలను, ఆదివాసీ సంస్కృతిని చూడాలనుకునే పర్యాటకులకు ఈ రైలు సేవలు ఎంతో ఉపాయోగపడుతుంది. ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసులు ఉదయం పూట పూరి, భువనేశ్వర్‌ వంటి ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించాలని చేస్తున్న డిమాండ్‌ నెరవేరనుంది.

నందపూర్‌లో పెట్రోల్‌ కొరత

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లా నందపూర్‌లో పెట్రోల్‌ కొరత ఏర్పడింది. గురువారం స్థానిక పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. పెట్రోల్‌ దొరకదనే వదంతుల నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. సమీప ఆంధ్రలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు నుంచి పెద్ద ఎత్తున వాహనదారులు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement