పర్లాకిమిడి: గుమ్మసమితి జుంబాడ పంచాయతీ సీసీరోడ్డు నిర్మాణంలో కూలీలు, గ్రామసభ కమిటీకి బిల్లు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టి పరారైన బ్లాక్ జూనియర్ ఇంజినీరు మహేష్ మరాండిపై ఏడీఎంఫల్గునీ మఝికి కలెక్టరేట్లో గ్రామస్తులు బుధవారం ఫిర్యాదు అందజేశారు. గ్రామసభ కమిటీ నిర్ణయం మేరకు జుంబాడ గ్రామపంచాయితీకి సీసీరోడ్డు పనులు సుమారు రూ. 14,28,000 ఖర్చుఅయ్యాయి. అయితే నాలుగు నెలలుగా పనిచేసిన కూలీలకు దినసరి కూలీ డబ్బులు అందలేదని అన్నారు. జేఈ మహేష్ మరాండి బ్లాక్లో విధులు కూడా నిర్వహించకుండా పరారైనట్టు జుంబాడ గ్రామస్తులు విలేకరులకు తెలియజేశారు. సీసీ రోడ్డు పనికి జుంబాడ గ్రామస్తులే సిమెంటు, ఇనుప రాడ్లు పర్లాకిమిడి నుంచి అరువుతెచ్చి పనులు జరిపించగా.. జేఈ మరాండి డిపార్ట్మెంట్ వర్క్ అని తన పేరుమీద బిల్లు పెట్టుకుని పరారైనట్టు గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై గుమ్మా బ్లాక్ బీడీవో దులారాం మరాండికి, కలెక్టర్కు గ్రీవెన్సులో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు. దీనిపై సమగ్రంగా జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ దర్యాప్తుచేసి తమకు న్యాయం చేయాలని జుంబాడ గ్రామస్తులు కోరారు. ఏడీఎం మఝిని కలిసిన వారిలో జుంబాడ సర్పంచు డినాన్ గోమాంగో, లిసాన్ గోమంగో, బిర్సింగ్ దోయిబెడా తదితరులు ఉన్నారు.


