రాయగడ: సదరు సమితి పరిధిలోని కొట్లాగుడ సమీపంలో గల సిరికొన వద్ద గల మూడు మందిరాల్లో సోమవారం రాత్రి దొంగతనాలు జరిగాయి. శైలేశ్వర్ మందిరం ప్రాంగణంలో గల మా సరళ, విశ్వకర్మ, హనుమాన్ మందిరాల్లో గుర్తు తెలియని దుండగులు హుండీలను విరగొట్టి నగదును చోరీ చేశారు. సరళా మందిరంలో గల అమ్మవారి విగ్రహానికి గల వెండి కళ్లను తస్కరించారు. మందిరంలో గల సామగ్రీని దోచుకున్నారు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం మందిరం తలుపులు తెరిచేందుకు పూజారి ఎ.భాస్కర్ వెళ్లారు. అప్పటికే తులుపులు తెరిచి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


