భువనేశ్వర్: స్థానిక హైటెక్ వైద్య బోధన ఆస్పత్రిలో ప్రపంచ నర్సింగ్ దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా రెండు రోజుల పాటు నిర్వహించారు. నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమాల్లో చురుకగా పాలుపంచుకున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా మే 12న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే నర్సింగ్ దినోత్సవం సేవ, త్యాగాలకు ప్రతీక. ఈ వేడుక నర్సుల పని సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన నర్సింగ్ డైరెక్టర్ డాక్టర్ శక్తి ప్రసాద్ మిశ్రా మాట్లాడుతూ.. నర్సులు లేకుండా ఆస్పత్రులలో చికిత్స, రోగి నిర్వహణ పూర్తిగా అసాధ్యమని అన్నారు. హై టెక్ వైద్య కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ దేబానంద మహాపాత్రో మాట్లాడుతూ.. హౌస్ సర్జరీ సమయం నుంచి ఆపరేషన్ థియేటర్ (ఓటీ) వరకు నర్సులే వైద్యులకు అన్ని వేళలా తొలి గురువులుగా ఉంటారని కొనియాడారు. డాక్టర్ రాకేష్ పణిగ్రాహి, డీన్, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాధామాధవ్ త్రిపాఠి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ మల్కిన్ బెహరా, హైటెక్ నర్సింగ్ స్కూల్ అండ్ కాలేజ్ డీన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్వాలా మహా పాత్రొ, చైర్పర్సన్ ప్రొఫెసర్ రీటా లెంకా, చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సిసిల్ జేవియర్, జా యింట్ డీఎమ్ఈటీ డాక్టర్ రోమా రతన్, ప్రొఫెసర్ సరోజ్ నళిని ప్రధాన్ అతిథులుగా హాజరయ్యారు.


