జయపురం: కొరాపుట్ జిల్లా గ్రామాల్లో నెలకున్న సమస్యలను తెలుసుకోవానికి జనాల్లోకి వెళ్లాలని సీపీఐ నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలసి సమస్యలపై చర్చించాలని, మే నెలలో గ్రామ పంచాయతీల్లో ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ పరిషత్ సమావేశం నిర్ణయించింది. స్థానిక కార్మిక భవన్లో బుధవారం పార్టీ నేత కామ్రెడ్ కుమార్ జాని అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ మూడు నెలల పార్టీ కార్యక్రమాల నివేదికను సభికులకు వివరించారు. అనంతరం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు కామ్రెడ్ ప్రమోద్ కుమార్ మహంతి ఇటీవల జరిగిన రాష్ట్ర పార్టీ పరిషత్ తీసుకున్న నిర్ణయాలను సభికులకు వివరించారు. ప్రతి ఏడాదిలాగనే ఈ సంవత్సరం కూడా సభ్యత్వ సేకరణ జాబితాను వెంటనే రాష్ట్ర కమిటీకి సమర్పించాలని, ఏప్రిల్ ఐదో తేదీన జరగనున్న అఖిల భారత దళిత హక్కుల రాష్ట్రస్థాయి సమావేశంలో కొరాపుట్ జిల్లా నుంచి ప్రతినిధులను పంపే విషయాన్ని వివరించారు. పార్టీ నాయకులు ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సహాయ, సంక్షేమ పథకాలు వారికి చేరుతున్నవీ లేనివీ తెలుసుకొని జాబితాను తయారు చేయాలని పార్టీ పిలుపునిచ్చిందని వెల్లడించారు. పార్టీ నేతలు గ్రామీణ ప్రజల నుంచి సేకరించిన సమస్యలపై మే నెలలో గ్రామ పంచాయతీ స్థాయిలలోఆందోళనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సమావేశం ప్రారంభంలో వందేళ్ల శతాయుస్మాన్ కమ్యూనిస్టు పార్టీ నేత నల్లకన్ను సోమనాథ్ పాత్రో, అలాగే అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ దాడులలో ఇరాన్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అగ్రనేత అయితొల్లా ఆలీ ఖామెనెయి, మరణించిన వారికి , కటక్ భంజీ మెడికల్ కళాశాల ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయంత దాస్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కమ్యూనిస్టు పార్టీ పాత్రపై వివరించారు. సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి కామ్రెడ్ ఝుధిస్టర్ రౌళో, సహాయ కార్యదర్శులు బురుదా బొడనాయిక్, కురమ్నాత్ భొత్రో, పూర్ణ చంద్రసువార్, నంద హరిజన్, రూపధర్ పూజారి ఉన్నారు.


