● కుమార్తెకు కులాంతర వివాహం చేయాలని నిర్ణయించడమే కారణం
కొరాపుట్: కాలం మారుతున్నప్పటికీ కుల రక్కసి ప్రజలను వీడడం లేదు. అందుకు అగ్ర, వెనుకబడిన కులాలనే తేడాలేదు. ఎంతటి వారైనా దీనికి బలికాకతప్పడం లేదు. ప్రతిపక్ష బీజేడీ పార్టీకి చెందిన నబరంగ్పూర్ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని కుటుంబాన్ని ఆ సమాజిక వర్గం కుల బహిష్కరణ చేసింది. గిరిజనులలో బోత్ర తెగకి చెందిన సదాశివని బోత్ర జాతి కుల సంఘం కులం నుంచి బహిష్కరించింది. అతని కుటుంబాన్ని ఎటువంటి శుభ, అశుభ కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని కులపెద్దలు తీర్మానం చేశారు. అలాగే అతని ఇంట జరిగే కార్యక్రమాలకు హాజరు కావద్దని బోత్ర కులం చెందిన వారికి హెచ్చరించారు. జోరిగాం సమితిలో జరిగిన బోత్ర సమాజ్ సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. సదాశివ కుమార్తెకి ఒడియా బ్రాహ్మణ యువకునితో ప్రేమ వివాహం జరగనుంది. వీరి ప్రేమకి ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్ధం జరిపారు. ఇది తెలిన బోత్ర సమాజ్ పెద్దలు తమ గిరిజన యువతి బ్రాహ్మణ యువకుడిని పెళ్లి చేసుకొంటుండంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఇదే గిరిజనులకు చెందిన బోత్ర సమాజ్ అతన్ని కులం నుంచి బహిష్కరించింది.
విమానాశ్రయంలో విలువైన గంజాయి స్వాధీనం
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 3 కోట్లకు పైబడి విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళ వారం ఉదయం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చేపట్టిన ఒక భారీ దాడుల్లో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం బ్యాంకాక్ నుంచి వచ్చిన 6ఈ–1066 విమానం ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఇద్దరు ప్రయాణికుల నుంచి నిషేధిత పదార్థం గంజాయి బయటపడింది. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా డీఆర్ఐ బృందం కూలంకషంగా తనిఖీ నిర్వహించగా ఇద్దరు నిందితుల నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వారివురు తమిళనాడు నివాసులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారిని డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
జగులై మాతకు ప్రత్యేక పూజలు
భువనేశ్వర్: జట్నీ మున్సిపల్ మండలి జేఎంసీ పరిధిలోని కుదియారి గ్రామ దేవత జగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాల్లో సప్తమి తిథిని పురస్కరించుకుని జగులాయి మాత పీఠంలో సాల మండన్, సూర్యపూజ తదితర పూజాదులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం అభిషేకం అనంతరం రూపకార్ విజయ్ పండా దేవీని కాళ రాత్రి రూప ధారణతో అలంకరించారు. షోడశ ఉపచార పూజలు, సప్త సతీ చండీ ఆహుతి అర్ధరాత్రి వరకు క్రమ పద్ధతిలో కొనసాగాయి. మహా అష్టమి పురస్కరించుకుని బుధవారం జగులై మాత మహాగౌరీ అలంకరణలో దర్శనం ఇస్తారని ఆలయ ప్రధాన అర్చకుడు వినోద్ పండా తెలియజేశారు.


