● పలు కీలక పత్రాలు దగ్ధం
భువనేశ్వర్:
కటక్ నగరం లింక్ రోడ్డులో ఉన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటలు నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. తెల్లవారు జామున కార్యాలయ భవనం నుంచి పొగలు కమ్ముతున్నట్లు స్థానికుల దృష్టికి వచ్చింది. అత్యవసర హెల్ప్లైన్ ద్వారా సమాచారం చేరదీయడంతో అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ కసరత్తులో చౌలియాగంజ్, కటక్ నగరం యూనిట్లతో సహా పలు బృందాలను రంగంలోకి దించారు. మొత్తం 20 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు.


