రాయగడ: వసంత నవరాత్రుల్లో భాగంగా స్థానిక బాలాజీనగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారి కల్యా ణం కనుల పండువగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించగా అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గుణుపూర్ గ్రీవెన్స్లో 86 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, గుణుపూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అజయ్కుమార్ ప్రధాన్ , జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి 86 వినతులను స్వీకరించిన అధికారులు వీటిలో 53 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. మరో 33 సామూహిక గ్రామ సమస్యలుగా గుర్తించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నవీన్చంద్ర నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
మజ్జి గౌరి అమ్మవారికి వెండి మకరతోరణం
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే చల్లని తల్లి మజ్జిగౌరి అమ్మవారికి 35 కిలోల వెండి మకర తోరణాన్ని రూపొందించారు. అజ్ఞాత దాతలు ఇచ్చిన వెండితో అమ్మవారికి ఈ వెండి మకర తోరణం రూపొందించామని ఆలయ మేనేజింగ్ ట్రస్టీ రాయిసింగి బిడిక తెలియజేశారు. ఈ మేరకు మందిర ప్రాంగణంలో శుద్ధి చేసి పుణ్యాహవచనం నిర్వహించి శక్తి హోమాన్ని జరిపారు. ఆలయ ట్రస్టు సభ్యులు వడ్డాది శ్రీనివాస్ రావు దంపతులు ఈ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమైన అమ్మవారి చైత్రోత్సవాల్లో ఈ తోరణాన్ని అమ్మవారి గర్భగుడిలో అలంకరిస్తారు.
సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
జయపురం: జయపురం సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. స్థానిక లంకేశ్వరి ఉద్యాన వనంలో ఎన్నిక ప్రక్రియ సోమవారం జరిగింది. అధ్యక్షులుగా శక్తి ప్రసాద్ పాణిగ్రహి, ఉపాధ్యక్షులుగా నరసింహ పాణిగ్రహి, లక్ష్మీనారాయణ మహంకుడొ, జి.సత్యనారాయణ, కార్యదర్శిగా అక్షయ కుమార్ సాహు, సహాయ కార్యదర్శులుగా నరేంద్రనాథ్ త్రిపాఠీ, అనీల్ పట్నాయక్, కోశాధికారిగా నవీణ చంద్రపాత్రో, సలహాదారులుగా భజన్ సింగ్, దీనబందు అగ్రవాల్ ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా గోవింద చంద్రసాహు, గణేష్ ఆచార్య, ప్రఫుల్ల రాయ్, సూర్యనారాయణదాస్, సుభాష్ జైన్, సుభాష్ చంద్రచౌదరి, రమేష్ చంద్ర త్రిపాఠీ, శివ ప్రసాద్ పట్నాయక్, ప్రితీష్ పట్నాయక్ను నియమించారు. అనంతరం నూతన కమిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.


