జయపురం: అప్పర్ కొలాబ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అప్పర్ కొలాబ్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో 2002 విద్యా సంవత్సరంలో మెట్రిక్ చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం అత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బందుమిలన్ పేరిట ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో.. వివిధ హోదాల్లో స్థిరపడిన 100 మందికిగా పూర్వ విద్యార్థులు 24 ఏళ్ల తరువాత కలుసుకొని సందడి చేశారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగాక్షేమాలు తెలుసుకున్నారు. గ్రూపు ఫొటోను తీసుకొని మురిసిపోయారు. ఈ సందర్భంగా ‘మొ స్కూల్ అభిజాన్’పథకంలో చదువుకున్న పాఠశాలకు 20 వేల రూపాయలను ప్రధాన ఉపాధ్యాయురాలు ధరిత్రి మహారాణ అందజేశారు. చదువు నేర్పిన అప్పటి గురువులను దుశ్శాలువలతో సత్కరించి గౌరవించారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు పి.జ్య్త్స్నోరాణి రావు, ఉపాధ్యాయులు తపన్ కిరణ్ త్రిపాఠీ, రామ మోహనపండ, ఇందుమతి దాస్, సంయుక్త పండా, జగదీష్ ప్రసాద్ స్వైన్ పాల్గొన్నారు.


