● కాశీనగర్, గుసాని సమితిల్లో బీజేడీ పార్టీకి షాక్
పర్లాకిమిడి: కాశీనగర్, గుసాని సమితుల్లో బిజూ జనతా దళ్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ యూత్ ప్రెసిడెంటు శాసనం లింగరాజు, కాశీనగర్ సమితి వైస్ చైర్మన్ ఎస్.కళ్యాణి, సీహెచ్ లోకనాథంతో పాటు వందలాది వారి మద్దతుదారులు, కార్యకర్తలు ఆదివారం జరిగిన మిశ్రణ్ పర్వ్లో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక బిజూ కళ్యాణ మండపములో బీజేపీ మిశ్రణ్ పర్వ్కు కేంద్ర మాజీ మంత్రి, గజపతి జిల్లా బీజేపీ ప్రభారీ విశ్వేశ్వర టుడు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే గుసాని నాలుగో వార్డు సర్పంచ్ కల్పనా ప్రధాన్, బొమ్మిక సర్పంచ్ జి.విమలావతి, మాజీ సమితి సభ్యులు లక్ష్మణరావు, భిన్నల మాజీ సర్పంచ్ శిశిర్ ప్రధాన్, హడ్డుభంగి, ఉప్పలాడ, ఖండవ, గుసానిబ్లాక్లోని అగర్ఖండి, ఘోర్నీ, బాగుసల గ్రామాల నుంచి అధికసంఖ్యలో వారి మద్దతుదార్లు, కార్యకర్తలు బీజేపీలోకి చేరారు. వీరి చేరికతో కాశీనగర్, గుసాని సమితిలో తమ పార్టీ బలం రెండింతలు అయ్యిందని గజపతి జిల్లా బీజేపీ ప్రభారీ విశ్వేశ్వర టుడు అన్నారు. తమ పార్టీలో 600 మందికిపైగా కాంగ్రెస్, బీజేడీ పార్టీల నుంచి చేరారన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లోగా మరికొంతమంది బీజేడీ నాయకులు బీజేపీలోకి రావకడం ఖాయమని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు ధీమా వ్యక్తం చేశారు. మిశ్రణ్ పర్వ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో, కాశీనగర్ మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, కాశీనగర్ మండల అధ్యక్షులు కోడూరు జీవన్రావు పాల్గొన్నారు.


