● సభను కుదిపేసిన ఎస్సీబీ
అగ్నిప్రమాద దుర్ఘటన
భువనేశ్వర్: కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి (ఎస్సీబీఎంసీహెచ్)లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాజకీయ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ రాజీనామా చేయాలని శాసనసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సంఘటనపై సాంకేతిక నిజ నిర్ధారణ పరిశీలన బందాన్ని ఏర్పాటు చేయడం, అధికారులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించడం (సస్పెండ్) చేయడం వంటి తక్షణ చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 13 మంది ప్రాణాలు బలిగొన్న విచారకర సంఘటన జరిగి ఐదు రోజులు గడిచినా ప్రభుత్వంలో జవాబుదారీతనం కొరవడిందని విపక్ష బిజూ జనతాదళ్ పార్టీ ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధ దాస్ విమర్శించారు. ఎస్సీబీఎంసీహెచ్లో 13 మంది మరణానికి కారణమైన ఘోర ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే ఐదు రోజులు గడిచినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఎవరికి భయపడుతోంది? అని ప్రశ్నించారు. ఇంతటి పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ దాస్ ఎద్దేవా చేశారు.ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకోవడానికి నిందను ఇతరులపై మోపుతోందన్నారు. నిజంగా బాధ్యులైన వారిని ప్రభుత్వం ఇప్పటికీ కాపాడుతోంది. కేవలం నష్ట పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుని మౌనంగా ఉండటాన్ని అంగీకరించలేమని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అలాగే కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి సూపరింటెండెంట్ను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఈ విషాదం తీవ్రమైన రాజకీయ ప్రతిచర్యలను రేకెత్తిస్తూనే ఉంది. దీంతో అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.


