ఇద్దరు మృతి
ఏడుగురికి గాయాలు
రాయగడ: బియ్యం లోడుతో వస్తున్న ఓ పికప్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. జిల్లాలోని బిసంకటక్ సమితి డుకుం పంచాయతీలోని కచపాకు గ్రామసమీపంలో శనివారం రాత్రి ఘటన జరిగింది. ఘటనలో మృతి చెందిన వారిలో డ్రింజు సరక (32), మదన్ సరక (43) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బిసంకటక్ క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పీహెచ్సీకి పంపించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కచుపాకు గ్రామానికి చెందిన కొందరు పికప్ వ్యాన్లో సమీపంలో గల ధాన్యం మిల్లులో ధాన్యం ఆడించిన అనంతరం వాటిని బస్తాల్లోకి ఎక్కించి వ్యాన్లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కచపాక గ్రామానికి సమీపంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వ్యాన్ లోపల, వ్యాన్ మీద కూర్చున్న వారు కిందపడిపోయారు. వీరిలో డ్రింజు, మదన్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు.


