రాయగడ: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు భావితరాలకు వాటిని అందించే విధంగా అందరూ కృషి చేయాలని కళింగ వైశ్య సంఘం, జిల్లా జ్యూయలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కింతలి అమర్నాథ్ అన్నారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక బురదల పోలమ్మ మందిరం ప్రాంగణంలో ఆదివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను ముఖ్యఅతిథిగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ఉగాది ఉత్సవాలను కళింగవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య సంఘం కార్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. అందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘం తరఫున ఇటువంటి తరహా పోటీలను నిర్వహించి మహిళలను ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని అన్నారు.
విజేతల వివరాలు
ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిని ఎన్.సొనాలి, ద్వితీయ బహుమతిని ప్రీతి, తృతీయ బహుమతిని ఆర్.కీర్తనలు దక్కించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా సీహెచ్ కళ్యాణి, కె.పద్మావతి పట్నాయక్ వ్యవహరించగా పోటీలను చిన్నారి చక్రధర్ పర్యవేక్షించారు. పాత్రికేయుడు, స్పందన సాహితీ సంస్థ సాంస్కృతిక విభాగం కార్యదర్శి కె.కె.ఎం.పట్నాయక్ అధ్యక్షత వహించారు. విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ప్రొత్సాహక బహుమతులను నిర్వాహకులు అందించారు.
ముగ్గులు వేస్తున్న మహిళలు


