అస్సాం ఎన్నికల్లో కొరాపుట్ ఎంపీ ఉల్క
కొరాపుట్: అస్సాం రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క పాల్గొన్నారు. శనివారం ఆ రాష్ట్ర రాజధానిలో పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అస్సాం రాష్ట్ర ఎన్నికల వ్యూహాల్లో సప్తగిరి ఉల్కని ఆ పార్టీ ప్రత్యేక పరిశీలకుడిగా నియమించింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, పార్టీ నాయకుల పర్యటనలు తదితర అంశాలకు సంబంధించిన ప్రతీ కమిటీలో ఉల్కని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు గౌహతిలోని ప్రఖ్యాత కామాఖ్య శక్తి పీఠం వద్ద ప్రియాంక గాంధీతో కలిసి సప్తగిరి ఉల్క ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రస్తుతం ఉల్క కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల పరిశీలకునిగా కొనసాగుతున్నారు.
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
పర్లాకిమిడి: నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చేసుకోవాలని జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు అన్నారు. రాయఘడ బ్లాక్ మినీ స్టేడియంలో శనివారం జిల్లాస్థాయి జాబ్మేళాను ప్రారంభించారు. జాబ్మేళాలో రాయఘడ, మోహనా, నువాగడ, ఆర్.ఉదయగిరి బ్లాకుల నుంచి 611 మంది యువతీ, యువకులు పాల్గొనగా, వారిలో 67 మంది సెలక్ట్ అయ్యారు. కార్యక్రమంలో ఏడిఎం ఫల్గునీమఝి, రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, వైస్ చైర్మన్ జ్యోతిరంజన్ పాణి, జెడ్పీటీసీ గౌతమీ జన్ని, జిల్లా ఎంప్లాయిమెంట్, స్కిల్ డవలప్మెంట్ అధికారి సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన
జయపురం: పట్టణంలోని ప్రసాదరావుపేటలో ఉన్న వనితా యాక్టివిటీ స్కూల్లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నియంత్రణపై శనివారం అవగాహన కల్పించారు. జయపురం అగ్నిమాపక విభాగ అసిస్టెంట్ ఫైర్ అధికారి సురేష్ కుమార్ బారిక్ నేతృత్వంలో అగ్నిమాపక విభాగ సిబ్బంది ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ విభాగంలో ఉండే పరికరాలు ఎలా వినియోగించాలో విద్యార్థులకు మాక్డ్రిల్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ వని తదితరులు పాల్గొన్నారు.
వేసవిపై సమీక్ష సమావేశం
మల్కన్గిరి: స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వేసవిపై సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ సోమేష్ ఉపాధ్యాయ అధ్యక్షత శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా వేసవిని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పకడ్బందీగా ఉండాలని సూచించారు. తాగునీటి సమస్యలపై ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. హీట్ స్ట్రోక్ కారణంగా మరణాలు జీరోకి తగ్గించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, అస్పత్రుల్లో తగిన ఔషధాలు, అవసరమైన ఏర్పాట్లు ఉండాలని సీడీఎంవోకు ఆదేశించారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అత్యవసర విభాగ అధికారి దీప్తి రంజన్ సాహు, అదనపు కలెక్టర్ వెదబల్ ప్రధాన్, జిల్లా పరిషత్ ప్రధాన అభివృద్ధి అధికారి, కార్యనిర్వాహక అధికారి దాశరథి సరాబు, పోలీసు అధికారి వినోద్ పటేల్, ఉప జిల్లా కలెక్టర్ దుర్యోధన్ భొయ్ తదితరులు పాల్గొన్నారు.
అస్సాం ఎన్నికల్లో కొరాపుట్ ఎంపీ ఉల్క
అస్సాం ఎన్నికల్లో కొరాపుట్ ఎంపీ ఉల్క


