ఆరోపణలు సరికాదు
జయపురం: జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతిపై మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత సూర్యనారాయణ రథ్ చేసిన ఆరోపణలు సత్య దూరమని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రూపక్ తురుక్ ఖండించారు. ఈ మేరకు స్థానిక జిల్లా కాంగ్రెస్ భవనంలో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. జగన్నాథ సాగర్ అభివృద్ధి కోసం వచ్చిన నిధులతో స్వయం సహాయక గ్రూపుల ద్వారా పనులు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. సాగర్ పరిసరాల అభివృద్ధి కోసం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) వారు కేవలం రూ.కోటి ఇచ్చారని, ఆ నిధులతో ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ నిర్వహిస్తున్న పనులు టెండర్ ప్రక్రియ ద్వారా జరుగుతున్నాయని వివరించారు. గత కౌన్సిల్ సమయంలో చేపల వలల కోసం వచ్చిన రూ.20 లక్షలు దుర్వినియోగం చేశారని ఆయన ప్రత్యారోపణ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నరేంద్ర మహంతి, పార్టీ జిల్లా కోశాధికారి నిహార్ బిశాయి, జయపురం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసంత కుమార్ నాయిక్, సీనియర్ నేత వెంకటరావు పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.


