బంగారం చోరీపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: ఏఎస్ఎన్ కాలనీలో తులంన్నర బంగారు కాసులు చోరీకి గురైనట్టు ఫిర్యాదు అందిందని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ పి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో విధులు నిర్వహిస్తూ.. ఏఎస్ఎన్ కాలనీలో నివాసముంటున్న ప్రగాఢ అశోక్కుమార్ కుటుంబంతో కలిసి ఈ నెల 16న తిరుపతి వెళ్లారు. తిరిగి ఆదివారం ఇంటికి వచ్చి చూసే సరికి మెయిన్ డోర్, గ్రిల్స్కు వేసిన తాళాలు తీసి ఉండడంతో ఆందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉంచిన బంగారం కాసులు పోయినట్టు గుర్తించి తమకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఎస్ఐ వెంకటేష్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలికి వెళ్లి దర్యాప్తులో భాగంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.
జీతాల చెల్లింపునకు
సహకరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జీతాల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదర్కొంటున్న డీఎస్సీ–2002 హిందీ భాషా పండితులకు జీతాల చెల్లింపు ప్రక్రియలో సహకరించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు పిసిని వసంతరావు, సహాధ్యక్షుడు కుప్పన్నగారి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు జిల్లా ఖాజానాశాఖాధికారి సి.హెచ్.రవికుమార్ను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. పెండింగ్లో ఉన్న జీతాల సమస్యకు పరిష్కారంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని అందించారు.