జి.కొండూరు: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను జి.కొండూరు పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి వెలగలేరు గ్రామానికి చెందిన బొమ్మనబోయిన శివాజీ, ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన రాణిమేకల వెంకటేశ్వర్లు, అటుపాక సుబ్రహ్మణ్య చారిలు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గంజాయి తీసుకొని వచ్చి విక్రయించేందుకు చెవుటూరు గ్రామ శివారులో శనివారం సాయంత్రం వేచి ఉన్నారు. ముందస్తు సమాచారంతో జి.కొండూరు ఎస్ఐ–2 గిరిజామణి తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరకేజీ గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.


