లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో డప్పు కళాకారులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద మంత్రి సత్యకుమార్ యాదవ్, మాధవ్ లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఎంజీ రోడ్డులో పీవీపీ మాల్ వరకూ వచ్చి, తిరిగి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్, పి.వి.ఎన్.మాధవ్ మీడియాతో మాట్లాడుతూ దళిత యువతలో ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక చైతన్యం నింపేందుకే ఈ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 వేల గ్రామాల్లో చాటింపు పోస్ట్లు భర్తీ చేయాలని, దేవాలయాల్లో, లలిత కళాశాలల్లో డప్పు కళాకారుల పోస్ట్లు భర్తీ చేయాలన్నారు. బీజేపీ నేతలు పాల్గొన్నారు.
‘దళితుల ఆత్మగౌరవ గుండెచప్పుడు’లో మంత్రి సత్యకుమార్ యాదవ్


