ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మెట్ల పూజలు నిర్వహించే మార్గాన్ని ఆలయ అధికారులు శనివారం మూసివేశారు. మెట్ల పూజ మార్గంలో శుక్రవారం శ్లాబ్ పెచ్చులు ఊడి పడి చిన్నారికి గాయమైన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచి మెట్ల పూజ మార్గాన్ని మూసివేసి మరమ్మతు పనులు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రమే మెట్ల మార్గంలో మరమ్మతులు నిర్వహించాలని నిర్ణయించిన దేవస్థాన అధికారులు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారాంతాల్లో అమ్మవారి మెట్ల పూజను చేసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. శనివారం కూడా భక్తులు మెట్ల పూజ చేసేందుకు మహామండపం వద్దకు చేరుకోగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మెట్ల మార్గాన్ని మూసివేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారని చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక రోజు ముందుగానైనా భక్తులకు సమాచారం తెలిసేలా ప్రకటన విడుదల చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మెట్ల మార్గాన్ని ఎన్ని రోజులు మూసివేస్తారనే సమాచారం కూడా తెలియడం లేదని సిబ్బంది పేర్కొనడం గమనార్హం.
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
పరిటాల(కంచికచర్ల): జనగణన – 2027 ప్రక్రియకు సంబంధించి దశల వారీగా ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, సెన్సస్ జేడీ జి.ప్రసన్నకుమార్ తెలిపారు. కంచికచర్లలో జరుగుతున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియను శనివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ వచ్చే సిబ్బందికి సరైన పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కచ్చితత్వంతో దోష రహితంగా డేటాను నమోదు చేయాలని, మార్గదర్శకాల ప్రకారం జనగణన నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జనగణన అనేది దేశ ప్రగతి, ప్రణాళికా రూపకల్పనకు అత్యంత కీలకమైన ప్రక్రియ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం వంటి రంగాల్లో భవిష్యత్ కార్యాచరణకు జనగణన గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సెన్సస్ జేడీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రతి సమాచారం విలువైందని, ప్రజల సహకారంతోనే సమగ్ర గణాంకాలు సిద్ధమవుతాయని ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది నిబద్ధతతో పనిచేసే నాణ్యమైన డేటా సేకరణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వీఎంసీ సెన్సస్ ఇన్చార్జి వెంకట రమణ, రూరల్ ఇన్చార్జి స్వాతి, డెప్యూటీ తహసీల్దార్ వి.మానస, వీఆర్వోలు, జన గణన సిబ్బంది పాల్గొన్నారు.


