బర్త్‌డే ఫంక్షన్‌ కోసం వచ్చి మృత్యు ఒడికి... | - | Sakshi
Sakshi News home page

బర్త్‌డే ఫంక్షన్‌ కోసం వచ్చి మృత్యు ఒడికి...

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

బర్త్‌డే ఫంక్షన్‌ కోసం వచ్చి మృత్యు ఒడికి... రోడ్డు ప్రమాదంలో డ్రిల్‌ మాస్టర్‌ దుర్మరణం మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): బంధువుల ఇంట్లో బర్త్‌డే ఫంక్షన్‌ కోసం సోదరునితో కలిసి ద్విచక్ర వాహనంపై నగరానికి వచ్చిన డ్రిల్‌ మాస్టర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ గుణదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన గోసాల శివరామకృష్ణకు ఇద్దరు సోదరులు ఉన్నారు. శివరామకృష్ణ అన్నయ్య గోసాల వెంకట కృష్ణ, తమ్ముడు గోసాల సుబ్బరామకృష్ణ గుడివాడలో నివాసం ఉంటున్నారు. వీరు శనివారం విజయవాడలో బంధువుల ఇంట్లో బర్త్‌డే ఫంక్షన్‌ కోసం యూనీకార్న్‌ బైక్‌పై వచ్చారు. ఫంక్షన్‌ చూసుకుని తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి గుడివాడ ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఏలూరు రోడ్డు గుణదల విద్యుత్‌ సౌధ సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో గోసాల సుబ్బరామకృష్ణ (38) అక్కడికక్కడే మృతి చెందగా గోసాల వెంకట కృష్ణ గాయపడ్డారు. దీంతో ఇరువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గోసాల శివరామకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చూసేసరికి తమ్ముడు సుబ్బరామకృష్ణ మృతి చెందగా అన్నయ్య వెంకట కృష్ణ గాయాలతో ఉన్నారు. మృతుడు సుబ్బరామకృష్ణ ప్రైవేట్‌ పాఠశాలలో డ్రిల్‌ మాస్టర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు భార్య కుమార్తె ఉన్నారు. గోసాల శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల నిరసన

తిరువూరు: ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ తిరువూరు, విజయవాడ ఆర్టీసీ డిపోల ఎదుట శనివారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎలక్ట్రికల్‌ బస్సుల కొనుగోలుకు డబ్బులు లేవంటూ ప్రైవేటు ఆపరేటర్లకు బస్సుల నిర్వహణ బాధ్యతను అప్పగించడం తగదని, ఈ నిర్ణయంతో ఆర్టీసీ డిపోలు మూతబడి కార్మికులు రోడ్డున పడతారని కార్మిక సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఆర్టీసీ యాజమాన్యమే ఎలక్ట్రికల్‌ బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement