బాల్య వివాహాల రహిత సమాజానికి కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలపడంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలపాలని అన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు నిబద్ధతతో కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టరేట్లో సోమవారం వాసవ్య మహిళా మండలి (వీఎంఎం) – బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకం చేసి విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, బాల్య వివాహాలు జరగకుండా కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. చట్టాలను గౌరవిస్తూ, నిబంధనలు పాటిస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిన అవసరముందన్నారు. ఈ ప్రచార రథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాల్య వివాహాల దుష్పరిణామాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ (1098), ఉమెన్ హెల్ప్లైన్ (181) కూడా అందుబాటులో ఉన్నాయని.. ఎవరైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చన్నారు. ఈ ప్రచార రథం ద్వారా లక్ష మందికి పైగా ప్రజల నుంచి సంతకాలు సేకరించాలని మహిళా మండలి బృందానికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ బి.కీర్తి, ప్రాజెక్టు డైరెక్టర్ రామానుజయ్య, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ ఎం.రాజేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రచార రథాన్ని ప్రారంభించినకలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ


