
అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా అర్జీలను నిర్ధేశించిన సమయంలో పరిష్కరించాల్సిందేనని.. ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని ఉపేక్షించబోనని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తారని.. వారి నమ్మకానికి బలం చేకూర్చే విధంగా నాణ్యతా ప్రమాణాలతో అర్జీలను పునరావృతం కాకుండా పరిష్కరించాలన్నారు. అర్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ ఉండరాదన్నారు. అర్జీల పరిష్కారంపై తాను ప్రతి రోజు సమీక్షిస్తున్నానని అర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకున్నా చర్యలు తప్పవని లక్ష్మీశ తెలిపారు. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
అర్జీల వివరాలు ఇవి..
రెవెన్యూ శాఖకు సంబంధించి 46, పోలీస్ శాఖకు 26, విద్య 23, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 12, పంచాయతీరాజ్ 9, ఏపీసీపీడీసీఎల్ 8, పౌరసరఫరాలు 5, విభిన్న ప్రతిభావంతులు 5, డీఆర్డీఏ 5, ఎండోమెంట్స్ 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 3, ఆర్ఐవో 3, ఆర్డబ్ల్యూఎస్ 3, హెల్త్ 2, సోషల్ వెల్ఫేర్ 2, సర్వే 2, వ్యవసాయం, పశుసంవర్ధక, కో – ఆపరేటివ్, అటవీ, జీఎస్డబ్ల్యూఎస్, హౌసింగ్, ఐసీడీఎస్, లీడ్ బ్యాంకు మేనేజర్, నైపుణ్యాభివృద్ధి, నీటివనరుల శాఖకు సంబంధించిన ఒక్కో అర్జీతో కలిపి మొత్తం 169 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పీజీఆర్ఎస్లో 169 అర్జీలు స్వీకరణ