
విద్యార్థులు సమాజ పురోగతికి దోహదపడాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి సమాజ పురోగతికి దోహదపడాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇదే ప్రతిభను కొనసాగిస్తూ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రతిభతో పాటు పట్టుదల కూడా ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి, నిబద్ధత ఉందన్నారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్స్గా ఎంపికై న 131 మంది పదో తరగతి విద్యార్థులు, 43 మంది ఇంటర్ విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు, షీల్డ్, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఉమామహేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం(ఇగ్నో) జూలై – 2025 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ డీఆర్ శర్మ తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ డిప్లొమో, డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జూలై 15గా పేర్కొన్నారు. పీజీ రెండో సంవత్సరం, డిగ్రీ రెండవ, మూడవ సంవత్సరం, సెమిస్టర్ విధానంలో చదివే విద్యార్థులు రీ–రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా జూలై 15లోగా చెల్లించవచ్చన్నారు. వివరాలకు ఇగ్నో వెబ్సైట్ లేదా కొత్తపేటలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం లేదా 0866–2565253 ఫోన్ నంబర్కు సంప్రదించాలని చెప్పారు.