గాలిగోపురంపై పిడుగుపాటు | - | Sakshi
Sakshi News home page

గాలిగోపురంపై పిడుగుపాటు

Jun 12 2025 3:01 AM | Updated on Jun 12 2025 3:53 AM

పెడన: పట్టణంలోని ప్రధాన ఆలయమైన శ్రీ గంగ, పార్వతి సమేత అగస్తేశ్వరస్వామి ఆలయ గాలిగోపురంపై బుధవారం వేకువ జామున సుమారు రెండున్నర గంటల సమయంలో పిడుగు పడింది. గోపురంపై సింహం బొమ్మపై పిడుగు పడటంతో అది పూర్తిగా ధ్వంసమైంది. గోపురంపై ఉన్న దేవతామూర్తుల బొమ్మలు కొన్ని దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న భాగాలు గోపురం కింద చెల్లచెదురుగా పడ్డాయి. ఆలయ ప్రధాన అర్చకుడు గూడూరు అగస్తయ్య పిడుగుపాటు సమాచారాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ, దేవదాయశాఖ అధికారులకు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ భళ్ల ప్రసాద్‌ తదితరులు ఆలయానికి చేరుకుని గాలిగోపురాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి సహకారంతో గాలిగోపురానికి మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) విజ్ఞప్తి చేసింది. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిమాండ్స్‌ డే పాటిస్తూ ఫెడరేషన్‌ ప్రతినిధులు ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియకు బుధవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రం జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు సమస్య ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉందని, కూటమి నాయకులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంతో అర్హులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. జర్నలిజం వృత్తి ప్రమాదంలో పడిన నేపథ్యంలో మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్‌ ఇవ్వాలని, అక్రెడిటేషన్‌ కమిటీలో జేఎఫ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం వెల్ఫేర్‌ ఫండ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని, పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.ఆంజనేయులు, అధ్యక్షుడు పి.వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు కె.సాంబశివరావు, కార్యదర్శి ఎం.బి.నాథన్‌ తదితరులు ఉన్నారు.

బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గవర్నర్‌పేట పాత బస్టాండ్‌ వద్ద జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఏలూరు రోడ్డులో బస్టాండ్‌ వైపు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. అతనిపై బస్సు చక్రం ఎక్కింది, దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆ వ్యక్తి వివరాలు తెలిపే ఆధారాలు లభ్యంకాలేదు. మృతుడి వివరాలు తెలిసిన వారు గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో లేదా 94406 27079, 0866–2576023 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.

గాలిగోపురంపై పిడుగుపాటు 
1
1/3

గాలిగోపురంపై పిడుగుపాటు

గాలిగోపురంపై పిడుగుపాటు 
2
2/3

గాలిగోపురంపై పిడుగుపాటు

గాలిగోపురంపై పిడుగుపాటు 
3
3/3

గాలిగోపురంపై పిడుగుపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement