
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల కార్మికులను రక్షించటం, సంరక్షించటం, బాలల హక్కుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం సందర్భంగా గురువారం కార్మిక శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, సంయుక్త ఫౌండేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రాఫిట్ షూ కంపెనీ సంయుక్త సహకారంతో సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని, బాల కార్మికులు లేని సమాజాన్ని అందరూ కలిసి నిర్మించాలన్నారు. బాలల హక్కులు, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని, ఆపదలో ఉన్న బాలలను రక్షించడంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘మా సంస్థలో బాల కార్మికులు లేరు’’ అనే ప్రత్యేకమైన స్టిక్కర్లను జేసీ ఆవిష్కరించారు. కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ఆశారాణి మాట్లాడుతూ బడి బయట ఉన్న బాలలను గుర్తించటం, వీధి బాలలుగా, బాల కార్మికులుగా ఉన్న బాలలను రక్షించడంలో సమాజం కీలకపాత్ర పోషించాలని అన్నారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎ.ధనలక్ష్మి, కార్మిక శాఖ అధికారులు టి.రాజేష్, డి.రత్నకుమారి, పి.రామ్ కుమార్, జి.విజయ సారథి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్ రాజేశ్వరరావు, సోషల్ వర్కర్లు శారద, లత, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కోటే ప్రకాష్ కుమార్, నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తంబి జోసెఫ్, అడ్మినిస్ట్రేషన్ ఫాదర్ మర్రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ జి.శేఖర్ బాబు, కోఆర్డినేటర్ కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఇలక్కియ