
డాక్టర్ సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం
కంకిపాడు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం లభించింది. విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరు లాంఫామ్లో నిర్వహించిన సభలో గురువారం ఆమె వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. చెరకు పంటలో పీక పురుగు, పొలుసు పురుగు ఉధృతి, యాజమాన్యం, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చెరకు పంటలను ఆశించే వివిధ పురుగుల యాజమాన్యం గురించి నిర్వహించిన పరిశోధనలు, బిందు సేద్యం పద్ధతిలో ఎరువులు అందించే విధానంపై పరిశోధనలకు సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం దక్కింది. ఆమె బంగారు పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మీ దేవి, వ్యవసాయశాఖ కమిషనర్ ఢిల్లీరావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ పాల్గొన్నారు. ఉత్తమ అవార్డు లభించినందుకు కేవీకే ఘంటసాల, వ్యవసాయశాఖ సిబ్బంది, కృష్ణాజిల్లాలోని పలువురు శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
డ్రగ్స్ కేసులో మరో నిందితుడు అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల 4న వాహనాల తనిఖీలో భాగంగా పట్టుబడిన ఎండీఎంఏ(మిథలిన్ డయాక్సి మిథపేటామిన్) కేసులో నిందితుడిగా ఉన్న పామర్రుకు చెందిన వల్లభనేని మనోహర్ను పటమట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా తాజాగా గురువారం మనోహర్ను చాకచక్యంగా రామవరప్పాడు వద్ద అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన మరో వ్యక్తిని, యూపీకి చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది.
గంజాయి సరఫరా చేస్తున్న ఇరువురు అరెస్ట్
9 కిలోల గంజాయి స్వాధీనం
పటమట(విజయవాడతూర్పు): పటమట ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తున్న ఇరువురు వ్యక్తులను పటమట పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పటమటలంక చేపల మార్కెట్ వద్ద గంజాయి విక్రయం జరుగుతోందని బుధవారం రాత్రి సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న సీఐ పవన్ కిషోర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గంజాయి సరఫరాదారులపై దాడి చేశారు. ఈ దాడిలో పున్నమితోటకు చెందిన గుడిగంట వంశీకుమార్ అలియాస్ సిద్ధా, పటమట పుట్టరోడ్డుకు చెందిన గుంజి సాయితరుణ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో వారివద్ద ఉన్న 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిరువురిపై కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గొల్లపూడి వెస్ట్ బైపాస్ రోడ్డులో అమరావతి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అమరావతి వెళ్లే రోడ్డుకు ఎడమవైపున రోడ్డుకు, పొలాలకు మధ్య కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతుని వయసు సుమారు 50 – 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. బాగా కుళ్లిపోయి గుర్తించలేని స్థితిలో ఉంది. మృతుని ఒంటిపై ఆకుపచ్చ లుంగీ, ఫుల్ హ్యాండ్స్ బనీను ఉన్నాయి. వివరాలకు భవానిపురం పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.