
లారీ, కారు ఢీకొని ఒకరి దుర్మరణం
కృత్తివెన్ను: అప్పటి వరకు ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు దూసుకువచ్చి కుటుంబ యజమానిని కబళించివేసింది. కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో 216 జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంపట్ల రాంగోపాల్ (41) ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రాంగోపాల్ తన భార్య రీతూ, కుమారుడు, కుమార్తెతో కలసి హైదరాబాద్లో బంధువుల వివాహానికి వెళ్లారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వారు తమ కారులో తిరిగి పాలకొల్లుకు బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సంగమూడి చినగట్టు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రాంగోపాల్ అక్కడికక్కడే మరణించగా, భార్య రీతూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కుమారుడికు సైతం తలకు బలమైన గాయాలవగా, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాంగోపాల్ పాలకొల్లులో రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి అధ్యక్షుడిగా పనిచేశారని, అందరితో కలివిడిగా ఉండే కుటుంబం ఒక్కసారిగా ప్రమాదంలో ఇలా ఛిద్రమైపోవడం ఎంతో విషాదాన్ని మిగిల్చిందని వారి బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపారు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భార్య పరిస్థితి విషమం,
కుమారునికి తీవ్ర గాయాలు
స్వల్ప గాయాలతో
బయటపడిన కుమార్తె
ఆ కుటుంబంలో పెను విషాదం
నింపిన ప్రమాదం

లారీ, కారు ఢీకొని ఒకరి దుర్మరణం