
ఉద్యోగుల్లో కుమ్ములాటలు!
● వాణిజ్య పన్నుల శాఖలో రచ్చకెక్కిన బాగోతం ● ఒక ఉద్యోగ సంఘ నేత తోటి ఉద్యోగులు, అధికారులపై ఫిర్యాదులు ● ఆ ఉద్యోగ సంఘ నేతపై మరికొందరు ఉద్యోగుల ఫిర్యాదు ● తనపై వచ్చిన ఆరోపణలపై డీసీ స్థాయి అధికారి లీగల్ నోటీసులు జారీ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యాలయాల్లో ఉద్యోగుల కుమ్ములాటలు ఇటీవల తారస్థాయికి చేరుకున్నాయి. కొంతమంది ఉద్యోగులు నిత్యం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తూ ఆ శాఖ ప్రతిష్టను బజారుపాలు చేస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గడిచిన కొద్ది మాసాలుగా ఈ ఫిర్యాదుల పర్వం నిత్యకృత్యంగా సాగుతోంది. అటెండర్ స్థాయి నుంచి అడిషనల్ కమిషనర్ కార్యాలయం వరకూ అందరిపైనా కొంతమంది ఉద్యోగులు పనిగట్టుకుని ఫిర్యాదులు చేస్తున్నారు.
ఒక ఉద్యోగ సంఘ నేతపై ఫిర్యాదులు
వాణిజ్య పన్నుల శాఖలో ఒక ఉద్యోగ సంఘ నేతపై పలువురి నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆ ఉద్యోగ సంఘ నేత విధులకు సక్రమంగా హాజరుకాకుండా తోటి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, వ్యాపార వర్గాల నుంచి సైతం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని ఫిర్యాదులు చేశారు. వాటికి అవసరమైన సాక్ష్యాలతో సహా ఉన్నతాధికారులకు అందించారు. ఆ కాపీలను న్యాయస్థానానికి కూడా పంపటంతో వాటిపై ఉన్నతాధికారులు స్పందించారు. విజయవాడ డివిజన్–3 పరిధిలోని ఒక సీటీవో స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ గడిచిన ఏడు మాసాలుగా కొనసాగుతూనే ఉంది.
ఉద్యోగులపై మహిళతో ఫిర్యాదు
వాణిజ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు కొంతమంది వ్యాపారులతో కలిసి తమకు గిట్టని వారిపై ఫిర్యాదులు చేయిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే క్రమంలో వాణిజ్య పన్నుల శాఖలోని ఒక ఉద్యోగి తన వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలను గురించి మాట్లాడటానికి వస్తే తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొద్దిమాసాల క్రితం ఒక మహిళా వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఆ ఫిర్యాదు వెనుక తోటి ఉద్యోగులు ఉన్నారనే ప్రచారం ఆ శాఖలో బలంగా వినిపించింది. దీనిపై కూడా విచారణ కొనసాగుతోంది.
డెప్యూటీ కమిషనర్ లీగల్ నోటీసులు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో డెప్యూటీ కమిషనర్ తనపై ఆరోపణ చేసిన ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పది మందిలో తన పేరు పెట్టడమే కాకుండా అవినీతికి పాల్పడుతున్నట్లు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా పరిగణించారు. వెంటనే లీగల్ నోటీసు ఇచ్చి తనపై చేసిన ఆరోపణలను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి సాక్షాలు ఉన్నాయని ప్రశ్నించారు.
విచారణలే... నివేదికలు ఉండవు
వచ్చిన ఫిర్యాదులపై విచారణలకు ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. కానీ విచారణ చేసిన తరువాత రిపోర్టులు మాత్రం బయటకు రావటం లేదు. కొంతమందిపై వేసిన విచారణలు పదేళ్లయినా ఇప్పటికీ నివేదికలు బయటకు రాలేదని, అంతా తూతూమంత్రంగా సాగిపోతుందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అడిషనల్ కమిషనర్, ఇతర ఉద్యోగులపై ఫిర్యాదులు
ఇటీవల ఒక ఉద్యోగ సంఘ నేత పది మందిపై రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అందులో జిల్లాకు చెందిన డెప్యూటీ కమిషనర్, రాష్ట్ర కార్యాలయంలోని అడిషనల్ కమిషనర్తో పాటుగా మరో ఎనిమిది మంది వివిధ స్థాయిల్లో పని చేస్తున్న ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. పైగా ఆరోపణల ప్రతిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటంతో అది మరింత దుమారాన్ని లేపింది. పలు ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తమపై లేనిపోని నిందలు వేస్తున్నారంటూ సదరు ఉద్యోగులు మండిపడుతున్నారు.