
నిత్య యోగాచరణతో రోగాలు దూరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం యోగాచరణ ద్వారా రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో గురువారం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర 23వ రోజు కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్స్ థీమ్ యోగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, వైద్య ప్రముఖులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడకుండా యోగాసనాలు రక్షణ కవచంగా ఉపయోగపడతాయని, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వైద్యుల చికిత్సకు కొన్ని రకాల యోగాసనాలు, ధ్యానం తోడైతే తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ ఉషారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హనుమయ్య, ఫాగ్సీ ప్రతినిధి డాక్టర్ త్రిపుర, రమేష్ హాస్పిటల్ వైద్యులు పి.రమేష్, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి వి.రాణి, ఆయుష్ అధికారి రామత్లేహి, వైద్యులు జె.సుమన్, రత్నప్రియదర్శిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వైద్యులు సింగరి ప్రభాకర్, కోడె ప్రభాదేవి, రమేష్(ఆయుష్ హాస్పిటల్), అనిల్ (అనిల్ న్యూరో హాస్పిటల్), సుబ్బారావు(అమెరికన్ ఆంకాలజీ), శివప్రసాద్(హృదయాలయ హాస్పిటల్స్), సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ