
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని తన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకపోగా లక్షలాది మంది ఉద్యోగులను తొలగించిందని, నిరుద్యోగ భృతి హామీ అటకెక్కించిందని మండిపడ్డారు. ఆచరణకు యోగ్యం కాని పథకాలను అమలు చేస్తామంటూ కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్సిక్స్ పేరుతో పేదలను మభ్యపెట్టిన కూటమి నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జొన్నలగడ్డ కోమల్ సాయి, విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా
ఇన్చార్జ్ దేవినేని అవినాష్