
బుడమేరు పనుల్లో అవినీతి ప్రవాహం
నిబంధనలకు నీళ్లు.. వర్క్ ఆర్డర్ లేకుండానే పనులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టా రాజ్యంగా మరమ్మతులు చేస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేస్తున్నా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు అందాయి. అయినా పనులకు సంబంధించిన ఎంబుక్లకు స్వాధీనం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. పనుల కేటాయింపులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కాంట్రాక్టర్లు పట్టించుకోవటం లేదు. దీనికి ప్రధాన కారణం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అవినీతి‘కోటీశ్వరుడు’, అక్రమాల ‘కిశోరం’ దళారులుగా 15 శాతం కమీషన్ వసూలు చేసిపెట్టడమేన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లకు అండగా ఆ ప్రజాప్రతినిధి రంగంలోకి పావులు కదుపుతున్నారు. ‘నేను చెప్పిందే వేదం. నోటి మాటతోనే పనులు చేయాలి’ అంటూ హుకుం జారీ చేస్తుండటంతో అధికారులు సైతం తలలు పట్టుకొంటున్నారు. ‘బుడమేరుకు అవినీతి గండ్లు’ శీర్షికన ఈ నెల తొమ్మిదో తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. జలవనరుల శాఖ ఈ కథనానికి స్పందించి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించడంతో అధికా రులు హడలిపోతున్నారు. వర్క్ ఆర్డర్ లేకుండా పనులు అప్పగించామని వివరణస్తే తాము ఇరుక్కుపోతామని, పోనీ పనులు జరగలేదని చెబితే పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదని, గండం నుంచి ఎలా గట్టెక్కాలని ఇంజినీరింగ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
కమీషన్లకు కక్కుర్తి పడే...
ప్రజాప్రతినిధికి చిత్తశుద్ధి ఉంటే వర్కింగ్ సీజన్కు ముందే బుడమేరు మరమ్మతులకు పరిపాలన అనుమతులు తీసుకొని, టెండర్లు పిలిచి రుతు పవనాలు ప్రవేశించక ముందే పనులు పూర్తి చేయాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో వరద పోటెత్తడంతో బుడమేరుకు గండ్లు పడ్డాయి. బుడ మేరు వరదతో విజయవాడ నగరానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వర్షాకాలానికి ముందే బుడమేరు గండ్లు పూడ్చాలని, ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచిస్తూ ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. అయితే అప్పుడు పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. వర్షాకాలం ప్రారంభంలో పనులు మంజూరు చేసి హడావిడి చేయడం వెనుక కమీషన్ల కుట్ర దాగి ఉందనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. పక్కా ప్రణాళిక ప్రకారమే వర్షాలు వస్తే ఇబ్బంది తలెత్తుతుందనే సాకు చూపి, పరిపాలన అనుమతులు రాకుండానే బుడమేరు పనులు చేపట్టారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వర్క్ ఆర్డర్ లేకుండానే జరుగుతున్న పనులపై విమర్శలు వెల్లువెత్తడంతో అవినీతి జరగటం లేదని అధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
పనుల్లో లోపించిన నాణ్యత
బుడమేరు గండ్లకు సంబంధించిన పనుల్లో నాణ్యత లోపించిందని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. గండ్లు పూడ్చేటప్పుడు లేయర్, లేయర్ను రోలర్తో తొక్కించి పటిష్టం చేయాలి. అయితే ఆ పనులు చేస్తున్న ప్రాంతాల్లో రోలర్ కనిపించటం లేదని పలువురు పేర్కొంటున్నారు. గండ్ల పూడ్చి వేత పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి బుడమేరులోని బుసక, చెరువులోని నల్లమట్టిని వినియోగిస్తున్నారు. ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు సైతం ఏమి చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు. రూ.43.91 కోట్ల విలువైన 126 పనులను టెండర్లు లేకుండా పప్పుబెల్లాల పంచడం ఏమిటని ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పక్కా ప్రణాళికతోనే పనుల మంజూరులో జాప్యం కాంట్రాక్టర్లకు అండగా కమీషన్ తీసుకొన్న ప్రజాప్రతినిధి తప్పులను కప్పి పుచ్చుకొనేందుకు అధికారుల తంటాలు మరమ్మతు పనులపై ఇప్పటికే విజిలెన్స్కు ఫిర్యాదు

బుడమేరు పనుల్లో అవినీతి ప్రవాహం