
మార్గదర్శకుల ఎంపికపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
ఎంపీడీఓలకు కలెక్టర్ లక్ష్మీశ ఆదేశం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ–4 కార్యక్రమం అమలుకు క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల ఎంపికపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ జి.లక్ష్మీశ ఎంపీడీఓలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, ఎంపీడీఓలతో పీ–4, ఉపాధి హామీ పథకం అమలు, పథకం అనుసంధానంతో చేపడుతున్న పనుల్లో పురోగతిపై కలెక్టర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బంగారు కుటుంబాలు–మార్గదర్శుల అనుసంధానం, బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికల అమలుకు అధికారులు కృషిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి జిల్లాలో 2025 –26 సంవత్సరానికి 80 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటికి 27.99 లక్షల పనిదినాలు పూర్తయ్యాయని, లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని స్పష్టం చేశారు. ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. బహుళ ప్రయోజనాలున్న సేంద్రియ ఎరువుల గుంతల (కంపోస్టు పిట్) నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ నెలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము పాల్గొన్నారు.