
నిండు ప్రాణాన్ని బలిగొన్న మట్టి దోపిడీ
గన్నవరం: మండలంలోని ముస్తాబాద పెద చెరువులో యథేచ్ఛగా సాగుతున్న మట్టి దోపిడీ ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. సూరంపల్లి గ్రామానికి చెందిన గజ్జల వెంకటేశ్వరరావు(55)ను మంగళవారం సాయంత్రం ముస్తాబాద గ్రామంలోని స్కూల్ సెంటర్లో మంగళవారం సాయంత్రం మట్టి ట్రాక్టర్ ఢీకొంది. అతని ఛాతీ భాగం, చేతులపై ట్రాక్టర్ టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అతడిని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, సూరంపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బుధవారం గన్నవరం పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం తరఫున కొందరు రంగంలోకి దిగి మట్టి తవ్వకందారులైన టీడీపీ నేతలను కాపాడే ప్రయత్నాలను ప్రారంభించారు. పోలీస్స్టేషన్లోనే మృతుడి కుటుంబ సభ్యులు, ఆ గ్రామ పెద్దలతో చెరువు తవ్వకందారులు చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం ఇచ్చేందుకు చెరువు తవ్వకందారులు అంగీకరించారు. సూరంపల్లి గ్రామ వైఎస్సార్ సీపీ కమిటీ మృతుని కుటుంబానికి రూ.50 వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ఆ పార్టీ నేత కందిమళ్ల శ్రీనివాసరావు తెలిపారు.