తడబడిన అడుగులు | - | Sakshi
Sakshi News home page

తడబడిన అడుగులు

Jun 12 2025 2:59 AM | Updated on Jun 12 2025 2:10 PM

AKTPM School in Krishna Lanka Construction Additional Floors Not Completed

అసంపూర్తిగా నిలిచిపోయిన విజయవాడ కృష్ణలంకలోని ఏకేటీపీఎం స్కూల్ అదనపు అంతస్తుల నిర్మాణం

నిర్లక్ష్యపు నీడలో సర్కారు బడులు

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం 

నాడు–నేడు పనులకు పైసా విదల్చని కూటమి ప్రభుత్వం 

జిల్లాలో 185 పాఠశాలల్లో అసంపూర్తిగా పనులు 

ఇంకా పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు 

అరకొరగానే చేరుకున్న స్టూడెంట్‌ కిట్లు 

ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సర్కారు బడులు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఒక వెలుగు వెలిగాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సగర్వంగా తలెత్తుకుని నడిచాడు. కార్పొరేట్‌ పాఠశాలల్లో కూడా లేని విధంగా ఐవీఆర్‌ ప్యానల్స్‌తో విద్యా బోధన జరిగేది. పాఠశాలలు పునఃప్రారంభం రోజునే పుస్తకాలు, బూట్లు, సాక్స్‌, డిక్షనరీ, బ్యాగు సహా 9 వస్తువులతో కూడిన కిట్‌ను అందజేసేవారు. 

మన జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో చదవడమే కాక ఐక్యరాజ్య సమితిలో తమ వాణి వినిపించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల కీర్తిని విశ్వ వ్యాప్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారు బడులపై నిర్లక్ష్యపు నీడలు కమ్మాయి. నాడు–నేడు రెండవ విడత పనులకు నిధులు సమకూర్చకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. స్టూడెంట్‌ కిట్లు ఇంకా పూర్తిస్థాయిలో బడులకు చేరుకోలేదు. 

గత ఏడాదిగా మూలన పడిన ఐవీఆర్‌ ప్యానెల్స్‌, ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు నోచుకోలేదు. దీనికి తోడు గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నా ఇంకా ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలు పూర్తికాలేదు. ఇలాంటి అయోమయ, అధ్వాన పరిస్థితి ముందెన్నడూ లేదని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కూటమి పాలనలో సర్కారు బడులు తిరోగమన దిశగా సాగుతున్నాయి. 

వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో గురువారం నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు బడిబాట పట్టేందుకు బ్యాగుల బూజు దులిపి సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. దానివలన విద్యార్థుల విద్యా సంవత్సరం సజావుగా జరగడానికి ఇబ్బందులు తప్పవని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను ఇప్పటి వరకూ పూర్తి చేయకపోవటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రోజుకొక నిర్ణయంతో ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. వారు ఆందోళనలకు దిగి గడిచిన పది రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం బదిలీలకు కొన్ని సడలింపులను తీసుకొచ్చింది. అయితే ఆచరణలో అవి అమలుకాకపోవటంతో ఇప్పటివరకూ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి కాలేదు.

పూర్తిస్థాయిలో అందని స్టూడెంట్‌ కిట్లు

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువుల కిట్లు ఇంకా పూర్తి స్థాయిలో పాఠశాలలకు చేరుకోలేదు. విద్యా సంవత్సరం మొదటి రోజే విద్యార్థులకు అవసరమైన కిట్లు ఇచ్చే పద్ధతిని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. పుస్తకాలు, యూనిఫామ్‌, బూట్లు, సాక్స్‌, బ్యాగ్‌, డిక్షనరీ ఇలా తొమ్మిది రకాల వస్తువులతో కూడిన కిట్లను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించి మొదటి రోజే విద్యార్థులకు చేరవేసింది. అయితే ఈ ఏడాది ఇంకా చాలా వస్తువులు పాఠశాలలకు చేరుకోలేదు. 90 శాతం పుస్తకాలు మాత్రం పాఠశాలలకు చేరుకున్నాయి. మిగిలిన బ్యాగులు, బూట్లు, సాక్సులు ఇలా పలు వస్తువులు ఇంకా చాలా పాఠశాలలకు చేరుకోలేదు. అవి ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.

మరమ్మతులకు నోచుకోని ఆర్వో ప్లాంట్లు, ఐవీఆర్‌ ప్యానల్స్‌

జిల్లా వ్యాప్తంగా చాలా విద్యాసంస్థల్లో ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా అన్ని విద్యాసంస్థల్లో ఐవీఆర్‌ ప్యానల్స్‌ను వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశాలను సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా స్మార్ట్‌ టీవీలు, ఐవీఆర్‌ ప్యానల్స్‌ను సరఫరా చేసింది. వాటిల్లో చాలా వరకూ మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటిని గత ఏడాది నుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో చాలా విద్యాసంస్థల్లో వాటిని మూలన పెట్టినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

నేడు కూడా కొనసాగనున్న టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌

మచిలీపట్నంఅర్బన్‌: వేసవి సెలవులలో ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు బడి బాట పట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 1,363 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 87,196 మంది విద్యార్థులు పాఠశాలలకు బయలుదేరుతున్నారు. 2023–24 వరకు గొప్ప ఫలితాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు దిగజారిపోయింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.17,981.08 లక్షలతో 1,261 పాఠశాలలకు మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించింది. చాలావరకు పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేసింది. మిగిలిన పాఠశాలల్లో పనులను కూటమి ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసింది.

పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు

ఉపాధ్యాయుల బదిలీలు పాఠశాలల పునః ప్రారంభం రోజుకి కూడా పూర్తికాలేదు. మొత్తం ఉమ్మడి కృష్ణాలో సుమారు 2,800 మంది ఎస్జీటీలకు సంబంధించి బదిలీల ప్రక్రియ సాగు తోంది. బుధవారం నాటికి సీనియారిటీ జాబితాలో 700 వరకు ఎస్జీటీలు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పాఠశాలల పునః ప్రారంభం రోజున కౌన్సెలింగ్‌ ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే మినహాయింపు ఇవ్వటం జరుగుతుందని, ఆ పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

ప్రభుత్వ బడులపై అంతులేని నిర్లక్ష్యం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకూ విద్యాశాఖలోని విద్యాసంస్థల మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్క రూపాయి సైతం విడుదల చేయలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వం నాడు–నేడు మొదటి విడతలో భాగంగా రూ.95.32 కోట్లతో 341 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి పూర్తి చేసింది. నాడు–నేడు రెండో విడతలో భాగంగా 596 విద్యాసంస్థల్లో రూ.240.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. పలు టెండర్లను ఆమోదించి పనులకు సరిపడా నిధులను విడుదల చేసింది. అంతలో ఎన్నికలు రావటంతో పనుల పర్యవేక్షణ కుంటుపడింది. మిగిలిన అరకొర నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపకపోవటంతో జిల్లాలో సుమారుగా 185 పాఠశాలల్లో పనులు మధ్యలో నిలిచిపోయాయి. వీటికి సంబంధించి చిన్నచిన్న పనులను పూర్తి చేస్తే చాలావరకూ అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న బడుల్లో విద్యార్థులు కూర్చోవటానికి సరిపడా తరగతి గదులు లేక ఇబ్బందులు పడనున్నారు.

ఆందోళన చెందుతున్న విద్యార్థులు 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా అభివృద్ధి చెందాయి. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో పాటుగా అనేక ప్రోత్సాహకాలను అందించి దేశంలోనే ఏపీ విద్యాసంస్థలను ఆగ్రభాగాన నిలిపిన ఘనతను గత ప్రభుత్వం సాధించింది. 

అయితే ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలకు, విధానాలకు కూటమి ప్రభుత్వం తిలోదకాలివ్వటం వలన తమ పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజులు కొండెక్కుతుంటే మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు దిగజారుతున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement