సుభాష్నగర్ : కుక్కకాటుతో రేబిస్ వ్యాధి వస్తే ఆ వ్యక్తి తిరిగి కోలుకోలేడని, వ్యాధి సోకకముందే అరి కట్టాలని ప్రభుత్వ వైద్య కళాశాల (మెదక్) కమ్యూనిటీ మెడిసిన్ హెచ్వోడీ, ప్రత్యేకాధికారి డాక్టర్ వినోద్ పేర్కొన్నారు. వ్యాధి నివారణకు అవసరమైన ఏఆర్ఐ టీకా మందు, ఇమ్యూనోగ్లోబులిన్ అన్ని పీహెచ్సీల్లో నిల్వ ఉంచుకోవాలన్నారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం పీహెచ్సీ, సీహెచ్సీల డాక్టర్లు, నర్సింగ్ అధికారులకు ‘కుక్క కాటు – నిర్వహణ, ఏఆర్వీ’పై శిక్షణనిచ్చారు. 0, 7, 28 రోజుల్లో టీకా ఇవ్వాలని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలున్నా ముందు జాగ్రత్తగా ఏఆర్ఐ టీకా ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్వో రాజశ్రీ, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వోలు పాల్గొన్నారు.
జిల్లాలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ గురువారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాతా శిశు ఆరోగ్య సేవలు, గర్భిణుల నమోదు, పీఎం సురక్షణ మాతా అభియాన్, జీవనశైలి వ్యాధులు తదితర కార్యక్రమాలపై కమిషనర్ వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాజశ్రీ, డీటీసీవో దేవీ రాజేశ్వరి, డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు తదితరులు పాల్గొన్నారు.


