● ఏపీలో ముగిసిన తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ పర్యటన
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఎన్ఆర్ఐ సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్దామని తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ పేర్కొంది. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం తదితర అంశాలపై అధ్యయనం కోసం నియమించబడిన తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన గురువారం ముగిసింది. కమిటీ చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, ఇతర కమిటీ సభ్యుల నేతృత్వంలో పర్యటన సాగింది. తొలిరోజు ఏపీ ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో భేటీ అయిన కమిటీ సభ్యులు రెండో రోజు ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ఏపీ సీఐడీ చీఫ్ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్తోపాటు ఇతర అధికారులు.. ఎన్ఆర్ఐ సెల్ అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కమిటీ సభ్యులు తమ సందేహాలను తెలుపగా, ఏపీ పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ అధికారులు నివృత్తి చేశారు. కమిటీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


