మద్నూర్(జుక్కల్): విద్యుత్ సంస్థకు సంబంధం లేని వ్యక్తి స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేస్తూ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తడిహిప్పర్గ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగురావ్(50) చిన్నచిన్న విద్యుత్ పనులు చేస్తూ లైన్మెన్ మహేశ్కు సహాయంగా ఉండేవాడు. గురువారం ఉదయం కరెంట్ లేకపోవడంతో గ్రామ పంచాయతీ వద్ద ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా దానిపైనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్కి కుడి చేయి తగలడంతో నాగురావ్ స్తంభంపైనే ప్రాణాలు విడిచాడు. ఆయన మృతదేహం తలకిందులుగా స్తంభానికి వేలాడింది. అయితే ఎల్సీ లేకుండానే నాగురావ్ను విద్యుత్ స్తభంపైకి ఎవరు ఎక్కమన్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మృతుడి ఫోన్ను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయంటున్నారు. మృతుడి కుమారుడు దత్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు.


