సద్వినియోగం చేసుకుంటున్నా..
అటు కాలక్షేపం..
బోర్లంలోని గ్రంథాలయంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు
బాన్సువాడ రూరల్ : వేసవి సెలవుల్లో కొంతమంది విద్యార్థులు సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది విద్యార్థులు కంప్యూటర్ విద్యపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కంప్యూటర్ శిక్షణ తీసుకుంటూ సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన మన్నె అనిల్ అనే యువకుడు గ్రామంలోని గ్రంథాలయంలో గ్రామపెద్దల సహకారంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో సుమారు 80 నుంచి 100 మంది విద్యార్థులు ఉదయం, సాయంత్రం బ్యాచుల వారీగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందుతున్నారు. మండల కేంద్రాలకు వెళ్లి వేలాది రూపాయలు ఫీజలు చెల్లించలేని పేద విద్యార్థులకు గ్రామంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రం వరంలా మారింది. మన్నె అనిల్ ట్రైనర్గా కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ స్కిల్స్, ఎం.ఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఫొటోషాప్, టైప్రైటింగ్లో శిక్షణ ఇస్తున్నారు.
కంప్యూటర్ శిక్షణ కోసం ప్రతిరోజు ఉదయం బ్యా చ్ లో వస్తున్నా. కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ నేర్చుకుంటున్నా. ప్రస్తుతం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరైంది. ఉన్నత చదువుల కోసం కంప్యూటర్ కోర్సులు వచ్చి ఉండాలి. – ఎం. లోహిత
మాలాంటి నిరుపేద విద్యార్థులకు అనిల్ సార్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ వరం లాంటింది. వేలాది రూపాయలు ఫీజు చెల్లించలేని నాలాంటి వారు ఎందరో ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఓపికతో కంప్యూటర్ జ్ఞానాన్ని అందిస్తున్నారు. – బి.షాణ్విత్
విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం ఆనందంగా ఉంది. సర్పంచ్ మన్నె రమేశ్, గ్రామపెద్దల సహకారంతో శిక్షణ కొనసాగుతోంది. భవిష్యత్తులో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తా.
– మన్నె అనిల్, ట్రైనర్
గ్రామంలో వేసవి సెలవు లను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరం. సెలవులను కంప్యూటర్ శిక్షణకు వెచ్చిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. కేంద్రంలో ఏర్పాట్లు బాగున్నాయి. – కొత్త సహస్ర
కంప్యూటర్ విద్యపై ఆసక్తి
చూపుతున్న విద్యార్థులు
ఉచితంగా శిక్షణ ఇస్తూ
ఆదర్శంగా నిలుస్తున్న మన్నె అనిల్


